ఘట్కేసర్, మే 15 (ప్రజావాణి): యంనంపేట్ గ్రామ పరిధిలోని బొంతకుంట వాగులో ఉన్న చెక్ డ్యామ్ సమస్యపై ఈరోజు హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ ని, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సమస్యకు సంబంధించిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు.
చెక్ డ్యామ్ ప్రాంతంలో కొందరు రియల్టర్లు అక్రమంగా మట్టిని పోస్తూ వాగు సహజ ప్రవాహాన్ని దెబ్బతీస్తున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అక్రమ చర్యల కారణంగా వర్షాకాలంలో సమీప కాలనీలకు వరద ముప్పు ఏర్పడే అవకాశముండటంతో పాటు చెక్ డ్యామ్ భద్రత కూడా ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంటుందని వివరించారు.
అదేవిధంగా, చెక్ డ్యామ్ పరిధిలో అక్రమంగా మట్టిని పోస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని, వాగు సహజ ప్రవాహాన్ని పరిరక్షించాలని హైడ్రా కమిషనర్ మరియు ఇరిగేషన్ అధికారులను కోరారు. ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షులు సహదేవ్ గౌడ్, పోలగోని లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
