మేళ్లచెరువు రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు.
మఠంపల్లి ఆగస్టు 4 (ప్రజావాణి)
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల పరిధిలోని శ్రీ శ్రీనివాస సాయి శివాయ రైస్ ఇండస్ట్రీస్లో రీజినల్ ఎన్ఫోర్స్మెంట్ టీం, నల్గొండ అధికారులు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా రబీ 2022-23, రబీ 2023-24, ఖరీఫ్ 2024-25 మరియు రబీ 2024-25 సీజన్లకు సంబంధించిన ధాన్యం నిల్వలను పరిశీలించగా, ఆన్లైన్ రికార్డులు, స్టాక్ వివరాలు మరియు మిల్లులో భౌతికంగా ఉన్న నిల్వల మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక పరిశీలనలో ఆక్షన్ ధాన్యాన్ని మినహాయించి సుమారు 19,843.429 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం అందుబాటులో లేకపోవడం గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా, రబీ 2022-23 సీజన్కు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించవలసిన సుమారు రూ.5.66 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉన్నట్లు కూడా గుర్తించారు. అలాగే రబీ 2023-24, ఖరీఫ్ 2024-25 మరియు రబీ 2024-25 సీజన్లకు సంబంధించిన సుమారు 19,843.429 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ధాన్యం విలువ సుమారు రూ.48 కోట్లుగా ప్రాథమిక అంచనా వేయబడింది.
ఈ విధంగా పరిశీలించినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం విలువ మరియు బకాయిలను కలిపి సుమారు రూ.53.66 కోట్ల మేర నష్టం సంభవించినట్లు అధికారుల బృందం ప్రాథమికంగా నిర్ధారించింది. పూర్తి స్థాయి విచారణ అనంతరం తుది నివేదికను సంబంధిత ప్రభుత్వానికి సమర్పించి, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ తనిఖీలలో రీజినల్ విజిలెన్స్ అధికారి శ్రీ ప్రతాప్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ గౌస్, జిల్లా పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, టెక్నికల్ అసిస్టెంట్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల అధికారి మాట్లాడుతూ, ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా మాయం చేయడం, దుర్వినియోగం చేయడం లేదా ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని తెలిపారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడిన వారిపై సంబంధిత చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు మరియు అమలులో ఉన్న నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.