జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి జులై 20 (ప్రజావాణి):
ఎలినినో ప్రభావంతో వర్షభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగయ్యే మెట్ట పంటల వైపు మొగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారులు సూచించారు. సోమవారం ఎండపల్లి మండలంలోని గుళ్లకోట, మారేడుపల్లి, ముంజంపల్లి, పడకల్ గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఎలినినో ఎఫెక్ట్ – వర్షభావ పరిస్థితుల్లో మెట్ట పంటల సాగు’ అనే అంశంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓలు మాట్లాడుతూ… ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవనందున, ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్కువ నీటితో సాగయ్యే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఆయిల్ పామ్, పెసలు, మినుములు, కందులు, సోయాబీన్, వేరుశనగ, జొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలు తక్కువ నీటితోనే మంచి దిగుబడిని ఇస్తాయని, మెట్ట పంటల వల్ల రైతులపై పెట్టుబడి భారం గణనీయంగా తగ్గి, మంచి లాభాలు వస్తాయని వివరించారు. చీడపీడల నివారణకు తగిన సమయానుకూల జాగ్రత్తలు తీసుకుంటే దిగుబడి మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో గుల్లకోట సర్పంచ్ గొల్లపల్లి మల్లేష్ గౌడ్, మారేడుపల్లి సర్పంచ్ బాలసాని శారద మల్లేష్ గౌడ్, ఏఈఓలు సందీప్, మౌనిక, లావణ్యలతో పాటు పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు రైతులు పాల్గొన్నారు.