prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 8:11 am Digital Edition : PRAJA VANI

8 నెలల చిన్నారి కిడ్నాప్… కేసు మూడు గంటల్లోనే చేదన

మేడిపల్లి పోలీసుల చాకచక్యం…బాలుడు సురక్షితం

తల్లి చెంతకు అపహరణకు గురైన బాలుడు

అపహరించిన మహిళ అదుపులోకి తీసుకున్న పోలీసులు

పోలిసులకు రివార్డ్ అందజేసిన డిసిపి సురేష్ కుమార్,మేడిపల్లి ఏసిపీ మోహన్ కుమార్

మేడిపల్లి ఆగస్ట్05(మన ప్రజావాణి) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా,
మేడిపల్లి పోలీసుల అప్రమత్తతతో ఎనిమిది నెలల బాలుడి అపహరణ కేసు కేవలం మూడు గంటల్లోనే ఛేదించబడింది. సీసీ కెమెరాల ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితురాలిని గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు,శిశువును క్షేమంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఉప్పల్ జోన్ డిసిపీ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… బోడుప్పల్ ఎన్ఐఎన్ కాలనీ చెందిన శ్రీ కోట్టి శివరాం,స్పందన దంపతుల ఎనిమిది నెలల కుమారుడు వైష్ణవ్ రుద్రాంశ్ బుధవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఇంటి వద్ద నుంచి అదృశ్య మయ్యాడు.దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు.ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 137(2) కింద కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఘటనను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించి పరిశీలించారు. నిందితురాలి కదలికలను సాంకేతిక ఆధారాలతో అనుసరిస్తూ, పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కేవలం మూడు గంటల్లోనే బాలుడిని అపహరించిన మహిళను దుర్గాభవానిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిన్నారిని క్షేమంగా రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
విచారణలో నిందితురాలు గతంలో గర్భం దాల్చిన అనంతరం శిశువును కోల్పోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు, అదే ఆవేదనతో బాలుడిని అపహరించినట్లు ప్రాథమికంగా వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఆమెపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఉప్పల్ జోన్ డీసీపీ అభినందించారు. అప్రమత్తంగా స్పందించి, తక్కువ సమయంలోనే శిశువును క్షేమంగా రక్షించడం పోలీసుల సమర్థతకు నిదర్శనమని ఆయన ప్రశంసించారు.ఈ ఘటనతో చిన్నారి సురక్షితంగా తిరిగి కుటుంబ సభ్యుల చెంతకు చేరుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వేగంగా స్పందించి కేసును ఛేదించిన తీరుపై తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో మేడిపల్లి ఏసిపి మొహన్ కుమార్,మేడిపల్లి సీఐ జలేందర్ రెడ్డి,సబ్ ఇన్స్పెక్టర్లు,పోలీసులు పాల్గోన్నారు.