ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి – ఎస్ఎఫ్ఐ
*ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్*
గోవిందరావుపేట, జూలై 25:ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ అధ్యక్షతన గోవిందరావుపేట మండల కేంద్రం లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ మాట్లాడుతూ, ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు అనేక సమస్యల మధ్య చదువులు కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
హాస్టళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు, స్నానాల గదులు, విద్యుత్, ఫ్యాన్లు, లైట్లు, పడకలు, పరుపులు, దుప్పట్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా అనేక చోట్ల లేవని తెలిపారు. నాణ్యమైన భోజనం అందించడం లేదని, మెనూ ప్రకారం ఆహారం పెట్టడం లేదని, పరిశుభ్రత లోపించడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు.
అలాగే హాస్టళ్లలో భద్రతా చర్యలు బలోపేతం చేయాలని, ఖాళీగా ఉన్న వార్డెన్లు, కేర్టేకర్లు మరియు ఇతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్, పరిశుభ్రమైన తాగునీరు, వైద్య సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని కోరారు.
జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లపై ఉన్నతాధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హాస్టళ్లలో అన్ని వసతులను అత్యవసరంగా కల్పించాలని అన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ఎల్ రవి,జిల్లా ఉపాధ్యక్షులు కోగిల బాలు, జిల్లా సహాయ కార్యదర్శి బట్ట స్వామి,జిల్లా కమిటీ సభ్యులు ధనుష్,వంశీ,సంజయ్, డేవిడ్,భీమయ్య, దేవ,సంతోష్ తదితరులు పాల్గొన్నారు