prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 2:43 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళల భవిష్యత్తుకు మైలురాయి: కొమ్మిడి శోభా రెడ్డి

ఘట్కేసర్, ఏప్రిల్ 17 (ప్రజావాణి): దేశ రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మక నిర్ణయమని కొమ్మిడి శోభా రెడ్డి అన్నారు. ఈ బిల్లు అమలులోకి వస్తే మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగి, సమాజంలో సమానత్వం బలపడుతుందని ఆమె పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్నప్పటికీ, రాజకీయాల్లో వారికి తగిన అవకాశాలు లభించడం లేదని ఆమె అన్నారు. ఈ బిల్లు ద్వారా మహిళలకు రాజకీయాల్లో స్థిరమైన స్థానం లభించి, నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం వస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల ప్రజా సమస్యలకు సమగ్ర పరిష్కారాలు లభిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వారు స్వయంగా చర్చించి పరిష్కరించగల సామర్థ్యం ఈ బిల్లుతో మరింత పెరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఆమె అభినందనలు తెలియజేస్తూ, మహిళా రిజర్వేషన్ బిల్లును త్వరితగతిన అమలు చేయాలని కోరారు. మహిళలు రాజకీయాల్లో ముందుకు రావడానికి అన్ని వర్గాలు సహకరించాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని అన్నారు.