prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 10:20 am Digital Edition : NARESH HUZURNAGAR

మరణం జరిగే వరకు మౌనమేనా..? ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద ప్రహరీ లేక ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యపు ఆట ఆడుతున్న విద్యుత్ శాఖ!”

 

నేరేడుచర్లలో తీవ్ర ఆగ్రహం – హెచ్చరించినా kadhala  అధికారులు.

నేరేడుచర్ల(ప్రజావాణి): నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ల చుట్టూ ఇప్పటికీ రక్షణ కంచె (ఫెన్సింగ్) లేదా ప్రహరీ గోడ ఏర్పాటు చేయకపోవడం ప్రజల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ సమస్యపై ఇప్పటికే పలు మార్లు వార్తలు ప్రచురితమైనప్పటికీ విద్యుత్ శాఖ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది.

ప్రధాన రహదారి పక్కనే పూర్తిగా బహిరంగంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద చిన్నారులు, వృద్ధులు, వాహనదారులు ప్రతిరోజూ అత్యంత సమీపంగా వెళ్లాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. “ఇది ఎప్పుడు ప్రమాదంగా మారుతుందో తెలియని భయంతోనే జీవించాల్సి వస్తోంది” అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ లీకేజీలు, షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ముందస్తు భద్రతా చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి స్పష్టమైన ఉదాహరణగా ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి నిర్లక్ష్యాల కారణంగా ప్రాణనష్టాలు సంభవించిన ఘటనలు ఉన్నప్పటికీ, అధికారులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోకపోవడం గమనార్హమని అంటున్నారు.

పశువులు, వీధి కుక్కలు వంటి మూగజీవాలు కూడా ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్దకు చేరే పరిస్థితి ఉండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరుగుతుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. “ఇంకా ఎంతమంది ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందిస్తారు? ప్రమాదం జరిగిన తర్వాతే చర్యలు తీసుకుంటారా?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ట్రాన్స్‌ఫార్మర్‌ల చుట్టూ బలమైన ఫెన్సింగ్ లేదా ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఏ చిన్న ప్రమాదం జరిగినా దానికి పూర్తి బాధ్యత అధికారుల నిర్లక్ష్యమేనని స్థానికులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.