మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు తిరుపతి జిల్లా పోలీసుల ఘన నివాళి
అల్లూరి దేశభక్తి, త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం : జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్
తిరుపతి, జూలై 4 (ప్రజావాణి):
స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని కొనియాడారు. బ్రిటిష్ పాలకుల దమనకాండకు వ్యతిరేకంగా ఆదివాసీలను సంఘటితం చేసి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన ఆయన దేశభక్తి, త్యాగనిరతి, ధైర్యసాహసాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన త్యాగం, చూపిన పట్టుదల ప్రతి భారతీయుడు స్మరించుకోవాల్సిన గొప్ప ఆదర్శమని అన్నారు. యువత ఆయన జీవితం నుంచి దేశభక్తి, సేవా భావాన్ని అలవరుచుకోవాలని సూచించారు.
అనంతరం అదనపు ఎస్పీలు, ఏఆర్ డీఎస్పీ, ఆర్ఎస్ఐలు, జిల్లా పోలీస్ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, పోలీసు సిబ్బంది అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీనివాసులు, అదనపు ఎస్పీ (సాయుధ దళం) శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఎస్ఐలు, జిల్లా పోలీస్ కార్యాలయం అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.