prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 12:20 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మధ్యాహ్నం 12 దాటినా తెరచుకోని సచివాలయం: విధులకు అధికారుల డుమ్మా, తీవ్ర ఇబ్బందుల్లో టేగురుపేట గ్రామస్తులు

టేకురుపేట ( ఆగస్టు 01 ప్రజావాణి):ప్రభుత్వ సేవలను గ్రామీణ ప్రాంత ప్రజల ముంగిటకే అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్థ క్షేత్రస్థాయిలో గాడి తప్పుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని టేగురుపేట గ్రామ సచివాలయం (స్వర్ణ గ్రామం) అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల పది నిమిషాలు దాటుతున్నప్పటికీ, ఈ సచివాలయం ఇంకా తాళం వేసే ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివిధ రకాల ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల దరఖాస్తులు, ఇతర అత్యవసర పనుల నిమిత్తం టేగురుపేట మరియు పరిసర ప్రాంతాల నుండి ఉదయాన్నే సచివాలయానికి చేరుకున్న ప్రజలు, గంటల తరబడి కార్యాలయం వెలుపలే వేచి చూడాల్సి వచ్చింది. మధ్యాహ్నం సమయం అవుతున్నా ఒక్క అధికారి కానీ, సిబ్బంది కానీ రాకపోవడంతో ఆ ప్రాంతమంతా బోసిపోయింది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి వచ్చిన వృద్ధులు, మహిళలు, రైతులు తీవ్ర ఎండలో, సరైన నీడ కూడా లేక భవనం బయట పడిగాపులు కాస్తూ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.బాధ్యత మరిచిన అధికారులుప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం నిర్ణీత సమయానికే సచివాలయాలు తెరిచి ప్రజాసేవలో అందుబాటులో ఉండాలి. కానీ టేగురుపేట సచివాలయంలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల అండదండలు ఉండటం వల్లే సిబ్బంది ఇంతటి బరితెగింపునకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.12 గంటలు దాటినా తాళాలు తీయకపోతే మేము మా సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి? అధికారుల నిర్లక్ష్యం వల్ల మా పనులు నిలిచిపోవడమే కాకుండా, మా సమయం,డబ్బు వృధా అవుతున్నాయి” అని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ప్రజా సేవ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి భవనాలు నిర్మించి, సిబ్బందికి జీతాలు ఇస్తుంటే, వారు మాత్రం విధులకు డుమ్మా కొట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు మరియు మండల పరిషత్ అధికారులు స్పందించి,టేగురుపేట గ్రామ సచివాలయంపై ప్రత్యేక నిఘా ఉంచాలని,విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యం వహించిన అధికారులపై,సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.