prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 4:43 pm Digital Edition : PRAJA VANI

మద్యం తాగొద్దని మందలించడంతో గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

తంగళ్లపల్లి, ప్రజావాణి ఆగస్టు 6: తంగళ్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు మద్యం సేవించడం మానుకోవాలని చెప్పడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి గడ్డి మందు తాగి, చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి గ్రామానికి చెందిన అట్టె మల్లేశం (55), కురుమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన గత కొంతకాలంగా మద్యానికి బానిసగా మారినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మద్యం తాగొద్దని కుటుంబ సభ్యులు పలుమార్లు సూచించడంతో మనస్తాపానికి గురైన మల్లేశం, జూలై 30 మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు.ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లారెడ్డిపేట మండలంలోని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ గురువారం ఉదయం సుమారు 4 గంటల సమయంలో మల్లేశం మృతి చెందాడు.మృతుడి మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని ఆయన పెద్ద కుమారుడు అట్టె చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.