మఠంపల్లి లో వీబీజీరాంజీ ఉద్యోగుల 5వ రోజు నిరసన.
మఠంపల్లి ఆగస్టు 5 (ప్రజావాణి)
పే స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీబీజీరాంజీ ఉద్యోగులు చేపట్టిన పెన్ డౌన్-షట్ డౌన్ నిరసన బుధవారం 5వ రోజుకు చేరుకుంది. మఠంపల్లి మండలంలోని ఉపాధి హామీ కార్యాలయంలో విధులకు దూరంగా ఉంటూ ఉద్యోగులు తమ నిరసనను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పే స్కేలు, బేసిక్ స్కేల్ కల్పించకపోవడం వలన ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తమ సమస్యలను తెలియజేస్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమకు వేతన శ్రేణి అమలు చేయడంతో పాటు గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎఫ్టిఈలుగా మార్చాలని, పెండింగ్ వేతనాలను విడుదల చేసి సకాలంలో జీతాలు చెల్లించాలని కోరారు. అదే విధంగా ఇంద్రవెల్లి సభలో మంత్రి సీతక్క ఇచ్చిన హామీని త్వరగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పెన్ డౌన్ – షట్ డౌన్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నిరసనలో ఏపీఓ ఉమ దేవి, ఈసి సందీప్, సిఓ లు రమాదేవి, అఫ్జల్, టెక్నికల్ అసిస్టెంట్లు సక్రు, బుంగయ్య, మల్సూర్ పాల్గొన్నారు.