హుజూర్నగర్ జూలై 19:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.13 కోట్ల నిధులు మంజూరు కావడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.
ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
మట్టపల్లి క్షేత్రాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఘాట్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, భక్తుల సౌకర్యాల పెంపునకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషితో మట్టపల్లి క్షేత్రానికి భారీగా నిధులు రావడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభివృద్ధితో మట్టపల్లి క్షేత్రం రాష్ట్రంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఎదగనుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.