
గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 01) మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో జనగణన 2027 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినట్లు కార్పొరేషన్ కమిషనర్ అలీం భాషా తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా, తొలి విడతలో ఇంటి నిర్మాణం, గృహ వసతులు వంటి కీలక వివరాల సేకరణను ఈరోజు మంగళగిరిలోని శాలివాహన నగర్లో ప్రారంభించారు.ఇంటి వద్దే వివరాల సేకరణ ఈ కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ అధికారులు ఇంటింటికీ వెళ్లి గృహ యజమానులను కలిసి, వారి నివాస గృహాల నిర్మాణం, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, కుటుంబ సభ్యుల సంఖ్య వంటి ప్రాథమిక వివరాలను సేకరించారు. ప్రజలు తమ ఇంటి వద్దకు వచ్చే ఎన్యూమినేటర్లు సూపర్వైజర్లకు అవసరమైన సమాచారాన్ని అందించి సహకరించాలని కమిషనర్ కోరారు.దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన జనగణన ఈ సందర్భంగా కమిషనర్ అలీం బాషా మాట్లాడుతూ, జనగణన కార్యక్రమం దేశ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది వేస్తుంది. ప్రజల జీవన స్థితిగతులు, అవసరాలు అర్థం చేసుకునేందుకు ఇది అత్యంత అవసరం. అందువల్ల ప్రతి కుటుంబం సరైన సమాచారం ఇవ్వడం ఎంతో ముఖ్యమైనది అని తెలిపారు.మొదటి దశ గృహ వివరాలు, రెండో దశ జనాభా లెక్కలు ఈ ప్రక్రియ నెలరోజుల పాటు కొనసాగుతుందని,తొలి దశలో గృహ నిర్మాణం, వసతుల వివరాలు సేకరించబడతాయని చెప్పారు. అనంతరం రెండో దశలో జనాభా లెక్కల ప్రక్రియ చేపడతామని వివరించారు.సిబ్బంది నియామకం & డిజిటల్ నమోదు మంగళగిరి తాడేపల్లి పరిధిలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు మొత్తం 539 మంది ఎన్యూమినేటర్లు, 87 మంది సూపర్వైజర్లను నియమించామని తెలిపారు. వీరు ఇంటి వద్దకు వచ్చినప్పుడు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కే. శకుంతల, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.జనగణన కార్యక్రమం దేశాభివృద్ధికి ఎంతో కీలకమని కాబట్టి మీ ఇంటికి వచ్చే అధికారులకు సరైన వివరాలు అందించి సహకరించవలసినది గా కోరడమైనది.