భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం.. కుక్కల పాలైన ప్రసవ వ్యర్థాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. గర్భిణీల ప్రసవాల అనంతరం వెలువడే బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా సేకరించి, వాటిని వరంగల్ కేఎంసీకి తరలించే అధికారిక వాహనానికి అప్పగించాల్సి ఉండగా, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సాధారణ చెత్తలో పడవేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యర్థాలను వీధి కుక్కలు తింటున్న దృశ్యాలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం వైద్యశాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. బయోమెడికల్ వ్యర్థాలను నిర్లక్ష్యంగా పారవేయడం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణను నిబంధనలకు అనుగుణంగా కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరుతున్నారు.