బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అభివృద్ధికి తోడ్పడాలి
కేంద్రమంత్రి బండి సంజయ్కు వినతిపత్రం అందజేసిన
లక్ష్మీనరసింహస్వామి ఆలయకమిటీ బృందం
బెజ్జంకి,ఏప్రిల్ 5(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అభివృద్ధి కోసం ఆలయ కమిటీ సభ్యులు కేంద్రమంత్రి బండి సంజయ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని వారు కోరారు.ఈ యొక్క వినతిపత్రంలో భాగంగా గుట్టపై ఉన్న ఆలయం చుట్టూ అదనంగా 15 మీటర్ల స్థలం పెంచేందుకు పిల్లర్లు వేసి స్లాబ్ నిర్మాణం చేయాలని, కుట్ట ముందు ఉన్న పాత కమాన్ స్థానంలో నూతన రాజగోపురం నిర్మించాలని సూచించారు. గుట్టపై మరమ్మత్తులు చేపట్టాలని కూడా అభ్యర్థించారు.
అలాగే చిలాపూర్ రోడ్డు నుండి గుట్ట వెనుక గుండారం రోడ్డు వరకు 20 అడుగుల వెడల్పుతో 600 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం, వర్షపు నీటి కాలువల ఏర్పాటు చేయాలని కోరారు. గుడి ముందు ధర్మగుండం చుట్టూ సీసీ ప్లాట్ఫారం నిర్మాణం, మురుగు నీటి కాలువలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
వృద్ధులు సులభంగా గుట్టపైకి చేరేందుకు ప్రత్యామ్నాయ రహదారి, పూజల కోసం అన్ని సౌకర్యాలతో విశ్రాంతి భవనం, శాశ్వత తాగునీటి వాటర్ ప్లాంట్, పురుషులు మరియు మహిళల కోసం ఆధునిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని వినతిలో పేర్కొన్నారు.ఈ అభ్యర్థనలపై కేంద్రమంత్రి బండి సంజయ్ సానుకూలంగా స్పందిస్తూ దేవస్థాన అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జెల్లా ప్రభాకర్, డైరెక్టర్లు బర్ల రాజయ్య, బెజుగం విశ్వ ప్రసాద్, గుబిరే చంద్రయ్య, ధోనె శ్యామ్, అయిలేని విజయ, బోనగిరి ప్రభాకర్, ప్రధాన అర్చకులు శేషం మధుసూదనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.