prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 5:56 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బాపట్ల జిల్లాలో జరిగిన ఓ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.*

ప్రజావాణి న్యూస్ (మార్చి14)బాపట్ల .నిశ్చితార్థం జరిగి పెళ్లి పీటలు ఎక్కాల్సిన కుటుంబంలో అనూహ్యంగా విషాదం చోటుచేసుకుంది. కాబోయే వరుడు నమ్మక ద్రోహం చేయడమే కాకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి-కూతురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మార్టూరు మండలం పరిధిలోని ద్రోణాదుల గ్రామంలో చోటుచేసుకుంది.ఆ గ్రామానికి చెందిన సిరికొండ శ్రీనివాసరావు కుమార్తె దివ్య హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. మంచి చదువులు పూర్తి చేసి ఉద్యోగం సాధించిన ఆమెకు కుటుంబ సభ్యులు మార్టూరుకు చెందిన మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రావులకొల్లు శేషుబాబుతో వివాహం నిశ్చయించారు. గత ఏడాది డిసెంబర్ 14న ఇద్దరికీ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేసవిలో పెళ్లి జరగాల్సి ఉండగా అనూహ్యంగా,పరిస్థితులు మారిపోయాయి.ఈ నెల 4వ తేదీన పెళ్లి సంబంధం విషయమై మాట్లాడుకోవాలని చెప్పి శేషుబాబు.. దివ్యను పిలిపించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా దివ్యను తాను రహస్యంగా అనుసరించి తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలను చూపిస్తూ ఆమె ప్రవర్తన సరిగా లేదంటూ నిందలు వేసినట్లు సమాచారం.అదే సమయంలో పెళ్లి చేసుకోనని స్పష్టంగా చెప్పడంతో దివ్య,ఆమె తల్లి తీవ్ర ఆవేదనకు గురయ్యారు.అదే రోజు తల్లి-కూతురు ఇద్దరూ ఎలుకల మందు,గడ్డి మందు సేవించినట్లు తెలుస్తోంది. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న వారిని గమనించిన తండ్రి శ్రీనివాసరావు వెంటనే వారిని గుంటూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అసుపత్రిలో వైద్యులు వారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి విషమంగా మారింది. వారం రోజులుగా చికిత్స పొందుతున్న దివ్య గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. ఆమె మరణం తర్వాత కొద్ది గంటలకే తల్లి సుజాత కూడా ప్రాణాలు కోల్పోయింది. ఒకే కుటుంబంలో తల్లి-కూతురు ఇద్దరూ మరణించడంతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు, ఫోటోలు-వీడియోల అంశం, పెళ్లి రద్దు వెనుక ఉన్న కారణాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అవసరమైతే సంబంధిత వ్యక్తులను విచారించి నిజానిజాలు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఇలా విషాదం చోటుచేసుకోవడం అందరినీ కలచివేసింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది.