prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 8:42 pm Digital Edition : RAKESH PEDDAPALLY

బాధితులకు అండగా ఉంటాం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

 

రామగుండం పాత బజారులో వర్ష ప్రభావిత ప్రాంతాల పరిశీలన

ఎడతెరిపి లేని వర్షాలతో నీటమునిగిన వీధులు.. క్షేత్రస్థాయి పరిశీలనలో ఎమ్మెల్యే

వెంటనే నీటి నిల్వలను తొలగించాలని అధికారులకు ఆదేశం

అత్యవసర వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి

రామగుండం జూలై 29 ప్రజావాణి:

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పాత బజారు ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నీటి నిల్వలను, డ్రైనేజీల ప్రవాహాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత మున్సిపల్, విపత్తు నిర్వహణ అధికారులను ఆయన ఆదేశించారు. వీధుల్లో నిలిచిన వర్షపు నీటిని వెంటనే తొలగించి, డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. వర్షాల సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏ విధమైన అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, వర్షాల వల్ల ఎవరికీ నష్టం వాటిల్లకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని  స్పష్టం చేశారు.