బద్దేనపల్లి గేదెల దొంగతనం కేసు ఛేదన..
ఇద్దరు నిందితుల అరెస్టు, ఒకరు పరారీలో
తంగళ్లపల్లి, ప్రజావాణి జూలై 17: తంగళ్లపల్లి మండలంలోని బద్దెనపల్లి గ్రామ శివారులో గేదెలను దొంగిలించిన కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.బదనపల్లి గ్రామానికి చెందిన ఆరేటి పోచయ్యకు చెందిన రెండు గేదెలు, అదే గ్రామానికి చెందిన ఆరేటి వెంకటేష్కు చెందిన ఒక గేదె గత మే 23వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలను వినియోగించి నిందితులను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వీర్ల వెంకటరావు, చిత్తూరి గంగాధర్, వీర్ల మల్లికార్జునరావులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఆంధ్రప్రదేశ్కు పంపగా, ముగ్గురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.అదుపులోకి తీసుకున్న నిందితులను విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,30,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల వృత్తాధికారి కె. నాగేశ్వరరావు వెల్లడించారు.ఈ కేసును త్వరితగతిన ఛేదించిన తంగళ్లపల్లి పోలీసు అధికారి ఎం. ఉపేంద్రచారి, రెండో పోలీసు అధికారి ఎం. మల్లేశం, పోలీసు సిబ్బంది సంపత్ కుమార్, శ్రీనివాస్లను వృత్తాధికారి అభినందించారు.