బడ్జెట్లో ప్రొద్దుటూరుకు నిరాశ… అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు శూన్యం – ఇర్ఫాన్ భాష
ప్రొద్దుటూరుకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు లేవు.
రద్దు చేసిన నూతన మంచినీటి పైప్లైన్ ప్రాజెక్ట్ను పునఃప్రారంభించాలి.
ప్రొద్దుటూరు ఛానల్–1, ఛానల్–2తో పాటు ఇతర కాలువల అభివృద్ధి అత్యవసరం.
మెడికల్ కాలేజీ రాకపోవడం నిర్లక్ష్యం ఫలితం; పులివెందులకు తరలింపు.
యువత ఉపాధి కోసం పరిశ్రమలు స్థాపించాలి.కడప జిల్లా ప్రొద్దుటూరుకు ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి పనుల కోసం ఎలాంటి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం బాధాకరమని కాంగ్రెస్ ఇంచార్జ్ ఇర్ఫాన్ భాష పేర్కొన్నారు. కేవలం యునాని వైద్య కళాశాలకు మాత్రమే పరిమిత కేటాయింపులు జరిగాయని తెలిపారు.మంచినీటి సరఫరా, పారిశుధ్యం, ప్రధాన కాలువల ఆధునీకరణ, పూడికతీత వంటి కీలక పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు ఛానల్–1, ఛానల్–2తో పాటు మాడూరు, దొరసానిపల్లె, కొత్తపల్లె కాలువల అభివృద్ధి అత్యవసరమని అన్నారు. మార్కెట్ అభివృద్ధి పనులు కూడా నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో అయినా ప్రొద్దుటూరుకు తగిన నిధులు లభిస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైందన్నారు. అదేవిధంగా యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమల స్థాపనపై కూడా బడ్జెట్లో స్పష్టత లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో పరిశ్రమలను నెలకొల్పి స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల సమస్యలు మాత్రం మారడం లేదని ఆయన విమర్శించారు. ప్రతి వార్డులో మంచినీటి సమస్యలు కొనసాగుతున్నాయని, ముందుగా పాత పైప్లైన్ల పునరుద్ధరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 350 పడకల ఆసుపత్రి ఉన్న ప్రొద్దుటూరుకు మెడికల్ కాలేజీ రాకపోవడం మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిర్లక్ష్యం వలననే జరిగిందని ఆరోపించారు. రాచమల్లు సమక్షంలోనే ఆ మెడికల్ కాలేజీని వారి సొంత నియోజకవర్గమైన పులివెందులకు తరలించారని విమర్శించారు. ప్రస్తుత ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి అసెంబ్లీలో పట్టణ సమస్యలపై గళం వినిపించి ప్రొద్దుటూరుకు తగిన నిధులు సాధించాలని కోరారు. రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనబెట్టి ప్రజల ప్రాథమిక అవసరాలు, యువత ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఇర్ఫాన్ భాష విజ్ఞప్తి చేశారు