బడి పిల్లలు… వరి నాట్లు!
క్షేత్ర పర్యటనలతోనే ప్రత్యక్ష బోధన
రైతులతో కలిసి పొలంలోకి దిగిన విద్యార్థులు హెచ్ఎం రవీందర్ పిలుపు
చెన్నారావుపేట ఆగస్టు 3 ప్రజావాణి 
పుస్తకాల్లో చదివే చదువు కన్నా.. కళ్లారా చూసి, చేతులతో చేసి నేర్చుకునే విద్యే విద్యార్థుల మెదడులో పదిలంగా ఉంటుందని భోజేర్వు ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ అన్నారు. సోమవారం పాఠశాలకు చెందిన 5, 6, 7 తరగతుల విద్యార్థులను సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి అధ్యయన పర్యటనగా తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా పొలంలో వరి నాట్లు వేస్తున్న రైతు కూలీలతో విద్యార్థులు ముచ్చటించారు. అంతేకాకుండా స్వయంగా ప్యాంట్ మడచి, బురద పొలంలోకి దిగి నాట్లు వేసి ప్రత్యక్ష అనుభవాన్ని పొందారు. పర్యావరణ విజ్ఞానంలో భాగంగా వ్యవసాయ పంటలపై విద్యార్థులకు క్షేత్రస్థాయి అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు హెచ్ఎం తెలిపారు.దుక్కి నుంచి ధాన్యం వరకు.. పొలంలో దుక్కి దున్నడం, నాటు వేయడం నుంచి పంట కోత, ధాన్యం ఇంటికి చేర్చే వరకు జరిగే ప్రతి ప్రక్రియను ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రాక్టికల్గా వివరించారు. ఈ క్షేత్ర పర్యటనతో విద్యార్థులు ఎంతగానో ఉత్సాహపడ్డారు. ఈ కార్యక్రమంలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు పరమేశ్వర్, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, శ్వేతశ్రీ, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.