ఘట్కేసర్, జూలై 19: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం సోదేశపల్లి గ్రామానికి చెందిన మింకూరి కోమల తన కుమారుడు ఎం. రాకేష్ (32) కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు.
రాకేష్ గత మూడు సంవత్సరాలుగా ఘట్కేసర్ మండలం బాలాజీనగర్లోని వెంకటాద్రి టౌన్షిప్లో అద్దెకు ఉంటూ, నీలిమ ఆసుపత్రిలో స్టోర్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17వ తేదీ ఉదయం తల్లితో ఫోన్లో మాట్లాడిన అనంతరం అతని ఫోన్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
18వ తేదీ రాత్రి రాకేష్ పనిచేస్తున్న ఆసుపత్రి సిబ్బంది అతను ఫోన్కు స్పందించకపోవడంతో ఇంటి యజమాని అశోక్ను సంప్రదించారు. అనంతరం ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. 19వ తేదీ ఉదయం రాకేష్ తల్లి అతని నివాసానికి వెళ్లి చూడగా, ఇంట్లో మంచంపై రెండు మొబైల్ ఫోన్లు, ఓ లేఖ కనిపించాయి. అయితే రాకేష్ అక్కడ లేకపోవడంతో అదృశ్యమైనట్లు గుర్తించారు.
లేఖలో కుటుంబ సభ్యులు తన ప్రేమ వ్యవహారాన్ని అంగీకరించలేదని, సంబంధిత యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, తమ సంబంధం గురించి తన సహోద్యోగులకు తెలియజేయడం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని పేర్కొన్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల కారణంగా ఎక్కడికో వెళ్లిపోతున్నానని లేఖలో రాసినట్లు పోలీసులు తెలిపారు.
ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాకేష్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.