కడప ప్రజావాణిన్యూస్(మార్చి27) రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయొద్దని కోరుతూ అఖిల భారత విద్యార్థి బ్లాక్ (AISB) ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా,క్రీడా మరియు యువజన సేవల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఆయన నివాసం లో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా AISB జాతీయ కన్వీనర్ జయవర్ధన్, రాష్ట్ర అధ్యక్షుడు సగిలి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి తీసుకువచ్చే ముఖ్యమైన వనరులని తెలిపారు. వాటిని ప్రైవేటీకరణ చేయడం వల్ల విద్య ఖరీదు పెరిగి సాధారణ ప్రజలకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చకుండా ప్రజాహిత దృక్పథంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను బలోపేతం చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే సౌకర్యాలు, మౌలిక వసతులు మెరుగుపరచి, ఖాళీ పోస్టులను భర్తీ చేసి విద్యా ప్రమాణాలను పెంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో AISB నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.