ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ను పరిశీలించిన కొండాపూర్ ఎమ్మార్వో అశోక్.
ప్రజావాణి, కొండాపూర్ ,ఏప్రిల్20: మండల పరిధిలోని తోగరపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ను కొండాపూర్ ఎమ్మార్వో అశోక్ సందర్శించి సమగ్రంగా పరిశీలించారు. హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, పరిశుభ్రత తదితర అంశాలను ఆయన దగ్గరగా పరిశీలించారు.
ఈ సందర్భంగా హాస్టల్లోని వంటగది, భోజనశాల, నివాస గదులు, తాగునీటి సదుపాయాలను పరిశీలించి, విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అందుతున్న ఆహారం నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అని సిబ్బందిని ప్రశ్నించారు.
హాస్టల్లో పరిశుభ్రత మరింత మెరుగుపరచాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందించాలని సిబ్బందికి ఎమ్మార్వో సూచించారు. అలాగే విద్యార్థులు చదువులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అనుకూల వాతావరణం కల్పించాలని సూచించారు.
ఈ పరిశీలనలో సంబంధిత అధికారులు, హాస్టల్ వార్డెన్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

