*ప్రత్యామ్నాయ పంటల సాగుతో ఆదాయ స్థిరీకరణ*
*చెన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బానోతు ప్రసాద్*
* *మన ప్రజావాణి*, మందమర్రి రూరల్:- జూలై 24
రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం వలన ఆదాయాన్ని స్థిరీకరించుకోవచ్చునని చెన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బానోతు ప్రసాద్ తెలిపారు. శుక్రవారం మండలంలోని ఆదిల్ పేట్ గ్రామంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (ఎన్ఎంఎన్ఎఫ్) కార్యక్రమంలో భాగంగా రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, రైతులకు సహజ వ్యవసాయం ప్రాముఖ్యత, పంటల్లో చీడపీడల నివారణలో దాని పాత్ర, తక్కువ ఖర్చుతో పంటలు పండించి నేల ఆరోగ్యాన్ని కాపాడే విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా బానోతు ప్రసాద్ మాట్లాడుతూ, ఏల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం, ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులు, వాటి కారణంగా వ్యవసాయంపై కలిగే ప్రభావాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణ చేపట్టాలని, కంది, మినుము, పెసర, నువ్వులు, జొన్న వంటి పంటలు వేయడం వల్ల తక్కువ వర్షపాతం వలన కలిగే నష్టాలను తగ్గించుకోవచ్చునని సూచించారు. అనంతరం మండలంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి, స్టాక్ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు, గోదాం నిల్వలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని కిరణ్మయి, ఏఈఓ రాజశేఖర్, కృషి సఖీలు వసంత, లిఖిత, రైతులు పాల్గొన్నారు.
