బెజ్జంకి,మే 5(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై తోట తిరుపతి మంగళవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజల సహకారం లేకుండా పోలీసింగ్ సమర్థవంతంగా సాగదని,ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.యువత మైనర్ డ్రైవింగ్కు దూరంగా ఉండాలని హెచ్చరించారు.ముఖ్యంగా మైనర్లు వాహనం నడిపి ప్రమాదానికి గురైతే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు.మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని,ఎవరైనా మహిళలను వేధింపులకు గురి చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.ఎండాకాలంలో చిన్నారులు చెరువులు,బావులు,కాలువల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అలాగే వేసవిలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్నందున గ్రామాన్ని విడిచి వెళ్లేవారు తమ ఇంటి వద్ద ఉన్నవారికి సమాచారం ఇచ్చి వెళ్లాలని సూచించారు. రాత్రి సమయాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ప్రజలు పోలీస్ శాఖపై నమ్మకం ఉంచి సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని,ప్రజలతో స్నేహబంధం బలపడితే సమాజం సురక్షితంగా ఉంటుందని ఎస్సై తోట తిరుపతి తెలిపారు.