prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 1:46 am Digital Edition : PRAJA VANI

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యం అవసరం: కలెక్టర్

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యం అవసరం: కలెక్టర్

 

 

ప్రజావాణి వికారాబాద్ మార్చి 7:

 

 

విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సంబంధిత అధికారులను ఆదేశించారు.

 

99 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం పరిగి మండలం తుంకులగడ్డలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల,తో పాటు చిగురాల్‌పల్లి, గోవిందాపూర్ గ్రామాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నిరంతరం ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించాలని అధికారులకు సూచించారు. ఆరోగ్యం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

 

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వసతి గృహాలు, పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల్లో రోజువారీ మెనూ చార్ట్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే సీపీఆర్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం భోజనశాల, వంటగది, స్టోర్‌రూమ్‌లను పరిశీలించారు.

 

చిగురాల్‌పల్లి, గోవిందాపూర్ గ్రామాల్లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభల్లో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అధికారులు గ్రామాల్లోనే పర్యవేక్షణ నిర్వహిస్తున్నందున ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేసి పరిష్కారం పొందాలని అన్నారు. ప్రజా ప్రతినిధుల సహకారంతో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.

 

మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని, ఇంకా గ్రౌండింగ్ కాని ఇళ్లకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందించి లబ్ధిదారులను ప్రోత్సహించాలని తెలిపారు.

 

అనంతరం తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న భవనాల పనులను వేగవంతం చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కూడా పరిశీలించారు.

 

ఈ పర్యటనలో డీటీడబ్ల్యూఓ కమలాకర్ రెడ్డి, డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి, డీపీఓ జయసుధ, తహసిల్దార్ వెంకటేశ్వరి, ఎంపీడీవో హరి ప్రియ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, చైర్‌పర్సన్ రజిత, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఉమా సుజాత, ఐసీడీఎస్ సూపర్వైజర్ సింధు, , హరి చందర్ తదితరులు పాల్గొన్నారు.