prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 9:38 am Digital Edition : RAJASHEKARREDDY

“ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇథనాల్ పరిశ్రమలు”- కాలుష్యానికి వ్యతిరేకంగా అఖిలపక్షం భారీ నిరసన.. ఫ్యాక్టరీలు మూసివేయాలని డిమాండ్

బెజ్జంకి, జూలై 14 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఇథనాల్ పరిశ్రమల వల్ల ఏర్పడుతున్న కాలుష్యాన్ని అరికట్టి ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు.ర్యాలీకి ముందు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, కార్యాలయం ఎదుట బైఠాయించి ఇథనాల్ పరిశ్రమలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీకాంత్కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, ఇథనాల్ పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాల వల్ల తోటపల్లి రిజర్వాయర్, భూగర్భ జలాలు, గాలి తీవ్రంగా కలుషితమవుతున్నాయని, దీంతో ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన అన్నపూర్ణ, మిడ్ మానేరు వంటి ప్రాజెక్టుల ద్వారా మండలంతో పాటు నియోజకవర్గంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుతోందని గుర్తు చేశారు.
మండల ప్రజల ప్రాణాలు, రైతుల జీవనాధారమే తమకు ముఖ్యమని, కాలుష్యానికి కారణమవుతున్న ఇథనాల్ పరిశ్రమలను వెంటనే మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడితో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.