మంగళగిరి జూన్ 02 ప్రజావాణి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాంగణంలోగల హైకోర్టు అన్న క్యాంటీన్ను ఆంధ్రప్రదేశ్ అన్న క్యాంటీన్స్ సంస్థ సీఈఓ వంశీధర్ మరియు మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్.అలీమ్ బాషా ఈరోజు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా క్యాంటీన్లో అందజేస్తున్న అల్పాహారం,భోజనాల నాణ్యత,ఆహార పదార్థాల నిల్వ విధానం, వంటశాల పరిశుభ్రత,తాగునీటి సదుపాయాలు,భోజనశాల నిర్వహణ,పారిశుద్ధ్య ప్రమాణాలు మరియు మొత్తం నిర్వహణ వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆహార తయారీ మరియు పంపిణీ ప్రక్రియలు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతున్నాయా అనే అంశాలను సమీక్షించారు.అనంతరం క్యాంటీన్ సిబ్బందితో మాట్లాడి ఆహార తయారీలో నాణ్యత,పరిశుభ్రత మరియు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా ప్రభుత్వ మార్గదర్శకాలు మరియు ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగా క్యాంటీన్ నిర్వహణ కొనసాగించాలని ఆదేశించారు.అదేవిధంగా క్యాంటీన్ను వినియోగిస్తున్న ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి అందిస్తున్న ఆహార నాణ్యత,రుచి,సేవల ప్రమాణాలు, పరిశుభ్రత మరియు ఇతర సౌకర్యాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను స్వీకరించి,సేవలను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు పరిశుభ్రమైన, పోషక విలువలు కలిగిన నాణ్యమైన ఆహారాన్ని అందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందేలా అన్న క్యాంటీన్ల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అక్షయ పాత్ర సిబ్బంది,నోడల్ అధికారులు,అన్న క్యాంటీన్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.