న్యూఢిల్లీ, (మే 15) ప్రజావాణి న్యూస్ దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు మరోసారి ఇంధన భారం తప్పలేదు. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్,డీజిల్ ధరలను లీటర్కు సగటున రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాహనదారులపై అదనపు భారం పడనుంది.ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరపై రూ.3.29, డీజిల్పై రూ.3.14 పెంపు అమల్లోకి రాగా.. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ రెండింటిపైనా రూ.3 చొప్పున ధరలు పెరిగాయి. కొత్త ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియ ముగిసి, రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే ఇంధన ధరలను పెంచడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో స్థిరంగా ఉన్న ధరలను ఇప్పుడు ఒక్కసారిగా పెంచడంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, డాలర్ మారక విలువల్లో మార్పులు,రవాణా మరియు రిఫైనరీ వ్యయాల పెరుగుదల కారణంగానే ధరలు సవరించినట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన సమయంలో ఇంధన ధరల పెంపు మరింత ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.పెట్రోల్,డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి.. కూరగాయలు,సరుకు రవాణా,బస్సు ఛార్జీలు,క్యాబ్ సేవలు వంటి రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి, ఉద్యోగులు, రైతులు ఈ పెంపుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది.ఇంధన ధరల పెంపుపై ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి“ఎన్నికలు పూర్తయ్యాక ప్రజలపై భారాలు మోపడం ఇదేనా అభివృద్ధి?” అంటూ ప్రశ్నిస్తున్నాయి