మన ప్రజావాణి
చౌడేపల్లి, ఏప్రిల్ 21

ప్రకృతి వ్యవసాయ పద్ధతులను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తే రైతులు స్థిరమైన, లాభదాయకమైన వ్యవసాయాన్ని సాధించవచ్చని వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ తెలిపారు. బుధవారం కాగతి రైతు సేవా కేంద్రంలో మండలంలోని రైతు సేవా కేంద్ర సిబ్బంది, వ్యవసాయ సిబ్బందికి సమగ్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన పలు ముఖ్యమైన విధానాలపై సవివరంగా అవగాహన కల్పించారు. ముందస్తు వర్షాకాలపు విత్తనాల విత్తకం విధానం, ఏడాది పొడవునా పచ్చదనం కొనసాగించే విధానం, ఎండకాల పరిస్థితులను ఎదుర్కొనే తేమ సంరక్షణ విధానం, అర్ధచంద్రాకారపు గోతుల పద్ధతి వంటి అంశాలను వివరించారు.
వ్యవసాయ అధికారి మాట్లాడుతూ, ముందస్తు విత్తనాల విత్తకం ద్వారా పంటలు త్వరగా స్థిరపడతాయని, దీని వల్ల దిగుబడులు మెరుగుపడతాయని తెలిపారు. ఏడాది పొడవునా పచ్చదనం కొనసాగించడం వల్ల భూసారం పెరిగి నేల ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు.
అలాగే ఎండకాల పరిస్థితుల్లో నేలలో తేమను ఎక్కువకాలం నిల్వ ఉంచే విధానం ద్వారా పంటలను రక్షించవచ్చని వివరించారు. తక్కువ నీటితో కూడా సాగు సాధ్యమవుతుందని, రైతులకు ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయని తెలిపారు.
ఇక అర్ధచంద్రాకారపు గోతుల పద్ధతి ద్వారా వర్షపు నీటిని సేకరించి నేలలోకి చొరబాటును పెంచి మొక్కల వేర్లకు తగిన తేమ అందించవచ్చని చెప్పారు. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఈ విధానం పంటల పెరుగుదలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్ర సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.