బెజ్జంకి, జూన్ 30 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పోతారం గ్రామంలో మంగళవారం పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రజలకు పౌర హక్కులు, రెవెన్యూ, పోలీసు శాఖల సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి (ఆర్ఐ) సంతోష్ మాట్లాడుతూ, సమాజంలో ఎవరి హక్కులకు భంగం కలిగించే విధంగా ఎవరూ వ్యవహరించరాదని సూచించారు. పౌర హక్కులను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక దురాచారాలను ప్రతి ఒక్కరూ నిర్మూలించాలని, అన్ని కులాలు, వర్గాల ప్రజలు సోదరభావంతో మెలిగి సామరస్య వాతావరణాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రాజేందర్ రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.