పోరుమామిళ్ల, ఆగస్టు 01 ప్రజావాణి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరును పక్కాగా అమలు చేయాలని ఆదేశిస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. కడప జిల్లా పోరుమామిళ్ల మండల రెవెన్యూ కార్యాలయం (తహశీల్దార్ ఆఫీస్)లో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. శనివారం ఉదయం 11:30 గంటలు దాటినా కార్యాలయానికి డిప్యూటీ తహశీల్దార్ (DT) రాకపోవడంతో, వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది.పనుల కోసం వచ్చి.పడిగాపులు కాస్తూ.మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, సామాన్య ప్రజలు తమ భూ సమస్యలు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు మరియు ఇతర అత్యవసర పనుల నిమిత్తం ఉదయమే తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, కీలక బాధ్యతల్లో ఉన్న డిప్యూటీ తహశీల్దార్ ఉదయం 11:30 గంటలైనా తన సీట్లోకి రాకపోవడంతో కార్యాలయం వెలవెలబోయింది. సుదూర ప్రాంతాల నుండి బస్సులు, ఆటోలు ఎక్కి, ఖర్చు పెట్టుకుని వచ్చిన వృద్ధులు, రైతులు ఆఫీస్ బయట, ఆవరణలో ఎండలోనే పడిగాపులు కాస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపించిందా?”సమయపాలన పాటించని అధికారుల వల్ల మా పనులు ఎప్పుడు అవుతాయో తెలియడం లేదు. ప్రశ్నిస్తే సమాధానం చెప్పే నాథుడే లేడు”అని కార్యాలయానికి వచ్చిన ప్రజలు వాపోతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే మండల స్థాయి అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.సామాన్యుల సమయానికి, ఇబ్బందులకు కనీస విలువ ఇవ్వని ఇలాంటి అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉన్నతాధికారులు స్పందించాలి,ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకే కార్యాలయంలో ఉండాల్సిన అధికారులు, ఇంత ఆలస్యంగా రావడంపై జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పోరుమామిళ్ల రెవెన్యూ కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరును మరియు అధికారుల సమయపాలనను పరిశీలించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు డిప్యూటీ తహశీల్దార్పై తగిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.