వైయస్సార్ కడప జిల్లా ప్రజా వాణి న్యూస్ (ఏప్రిల్20) పోరుమామిళ్ల పట్టణంలో పెట్రోల్ కొరత రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. రెండు రోజులుగా పెట్రోల్ బంకుల్లో సరఫరా సరిగా లేకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన వారు కూడా బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.పట్టణంలోని ఎస్ఆర్ పెట్రోల్ పంపుల్లో ఆన్లైన్ సమస్య కారణంగా ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు యాజమాన్యం చెబుతోంది. మరోవైపు హెచ్పీ పెట్రోల్ పంప్లో పూర్తిగా స్టాక్ లేకపోవడంతో వాహనదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.“ఇవాళ వస్తుంది,రేపు వస్తుంది.అంటూ పంప్ యాజమాన్యం చెబుతున్నప్పటికీ, పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇంధనం తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ కొరత ప్రభావం రవాణాపై కూడా పడుతోంది.పాల ఆటోలు, బైక్లు,కార్లు నడవకపోవడంతో విద్యార్థులు,ఉద్యోగులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.ఇంధన సరఫరా ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.