prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 12:20 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పోరుమామిళ్లలో అభివృద్ధి పేరిట విధ్వంసం: చిన్న వ్యాపారుల పొట్ట గొడుతున్న అధికారులు!

పోరుమామిళ్ల,జూన్ 14 ప్రజావాణి పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే గాంధీ బొమ్మ రోడ్డు సెంటర్లో డ్రైనేజీ పనుల పేరుతో అధికారులు సాగించిన కూల్చివేతలు స్థానిక చిన్న వ్యాపారులను రోడ్డున పడేశాయి.కూల్చివేతలు సరే.నిర్మాణం ఎప్పుడు?“కూల్చడం సులువు.కట్టడం కష్టం”అన్న చందంగా మారింది ఇక్కడి అధికారుల తీరు.డ్రైనేజీ కోసం షాపులైతే పడగొట్టారు కానీ,అసలు ఆ డ్రైనేజీ ఎప్పటి వరకు పూర్తి చేస్తారనే దానిపై అధికారుల వద్ద స్పష్టమైన కార్యాచరణ లేదు.పనులు సగం ముక్కగా వదిలేసి,ఎంతవరకు డ్రైనేజీ కట్టాలో కూడా సరిగ్గా తేల్చకుండా,ఇప్పుడు ప్రజలను మరియు వ్యాపారులను “సహకరించాలి”అని కోరడం అధికారుల అసమర్థతకు అద్దం పడుతోంది.వీధిన పడ్డ వ్యాపారాలు:ఈ కూల్చివేతల వల్ల ఇక్కడే జీవనం సాగిస్తున్న పండ్ల వ్యాపారులు,చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూల్చిన శిథిలాల మధ్యే ప్రాణాలకు తెగించి,దుమ్ము,ధూళిలోనే వ్యాపారాలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.ఒకవైపు వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో,డ్రైనేజీ పనులను నత్తనడకన సాగిస్తే వ్యాపారాలు పూర్తిగా దెబ్బతినడమే కాకుండా,స్థానికంగా తీవ్రమైన అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.ప్రజా గళం-తక్షణ డిమాండ్లు:స్పష్టమైన గడువు ప్రకటించాలి డ్రైనేజీ నిర్మాణాన్ని ఎంత కాలంలో పూర్తి చేస్తారో అధికారులు లిఖితపూర్వకంగా స్పష్టం చేయాలి.చిరు వ్యాపారులకు రక్షణ కల్పించాలి,షాపులు కోల్పోయిన పేద వ్యాపారులకు వెంటనే ప్రత్యామ్నాయ స్థలాలు లేదా నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.సహకారం కావాలంటే సమాధానం చెప్పాలి కేవలం “సహకరించండి”అని నీతులు చెప్పడం ఆపి,పనుల్లో వేగం పెంచి వ్యాపారుల పొట్ట గొట్టకుండా డ్రైనేజీని వెంటనే పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి,గాంధీ బొమ్మ సెంటర్ వ్యాపారుల సమస్యలపై తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని వ్యాపార సంఘాలు హెచ్చరిస్తున్నాయి.