ఘట్కేసర్, మే 13 (ప్రజావాణి): పోచారం ఐటీ కారిడార్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీసులు విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహించారు.
ఎస్ హెచ్ ఓ కనకయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఎస్సై విజయ్ కృష్ణ రెడ్డి, ఏఎస్ఐ బాబురావు మరియు పోలీసు సిబ్బంది పాల్గొని ఎన్టిపిసి రోడ్డుపై వెళ్లే వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్లు, నంబర్ ప్లేట్లు తదితర అంశాలను పరిశీలించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచించారు.
అనుమానాస్పద వాహనాలు, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.