prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 8:58 am Digital Edition : PRAJA VANI

పెండింగ్ పనులు వెంటనే ప్రారంభించాలి

•పెండింగ్ పనులు వెంటనే ప్రారంభించాలి

*అధికారులతో కలిసి ప్రాంతాల పరిశీలన చేసిన మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్

రామచంద్రపురం, జూన్ 17 (ప్రజావాణి):రామచంద్రపురం డివిజన్‌లో మంజూరై పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై స్పందించిన జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ శాఖ అధికారులు బుధవారం డివిజన్‌లోని పలు ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.
ఇంజనీరింగ్ శాఖ ఎస్‌ఈ శంకర్ నాయక్, ఈఈ సురేష్, డీఈ వెంకటరమణ, ఏఈ శివకుమార్‌లతో కలిసి శ్రీ సాయినగర్ కాలనీ, మయూరి నగర్ ప్రాంతాల్లో పర్యటించిన పుష్పనగేష్, మంజూరైన పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్రత్యేకంగా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు వీర్శెట్టి, కార్యవర్గ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొని తమ సమస్యలను అధికారులకు వివరించారు. పెండింగ్ పనులపై త్వరలోనే చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు.