prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 12:36 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేంతవరకు సీపీఐ పోరాటం సాగిస్తాం

ఘట్‌కేసర్, మే 16 (ప్రజావాణి): పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ ఆర్‌జీకే కాలనీలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా సీపీఐ సీనియర్ నాయకులు కల్లూరు జయచంద్ర మాట్లాడుతూ, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని, మెట్రో రైళ్లలో ప్రయాణించాలని సూచించారని తెలిపారు. అయితే వారం రోజులు గడవకముందే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి పేద ప్రజలపై భారాన్ని మోపడం దారుణమన్నారు.

ఇంధన ధరల పెంపుతో కూరగాయలు, పప్పుదినుసులు, వంటనూనెలు, నిర్మాణ సామగ్రి తదితర నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ధరలు తగ్గించేంతవరకు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సదాశివ, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బి. పాండు, సీపీఐ మండల కార్యవర్గ సభ్యుడు ఈ. మురళి, శాఖ కార్యదర్శి శ్రీనివాస్ చౌదరి, డి. యాదవ్, శ్యామ్, సత్యనారాయణ, వినోద్ రెడ్డి, భాస్కర్, పద్మారావు, మోహన్, రవి తదితరులు పాల్గొన్నారు.