prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 7:50 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పుట్లంపల్లి చెరువుకట్ట రోడ్డులో పెచ్చురిల్లుతున్న తాగుబోతుల ఆగడాలు.. రైతు బోరు బావి వద్ద ఒకే నెలలో 5 సార్లు వైర్ల దొంగతనం!

* పట్టించుకోని పోలీసులు.. ఆందోళనలో గ్రామస్థులు, మార్నింగ్ వాకర్స్
* తక్షణమే స్పందించి నిఘా పెంచాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి

కడప జూన్27ప్రజావాణి నగర శివారులోని రిమ్స్ (RIMS) ఆసుపత్రి నుండి పుట్లంపల్లికి వెళ్లే చెరువుకట్ట రోడ్డు పక్కన గల వ్యవసాయ భూముల్లో దొంగల,తాగుబోతుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. పుట్లంపల్లి గ్రామానికి చెందిన రైతు నాగిరెడ్డి రామిరెడ్డికి చెందిన వ్యవసాయ బోరు మోటార్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు ఒకే నెలలో ఐదుసార్లు దొంగిలించారు.వరుస దొంగతనాలతో సదరు రైతు తీవ్ర ఆర్థిక నష్టానికి గురై,సాగు నీరందక పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వ్యవసాయ బావుల వద్ద దొంగతనాలే కాకుండా,ఈ చెరువుకట్ట బాటపై కొందరు తాగుబోతులు విచ్చలవిడిగా మద్యం సేవించి,ఖాళీ బీరు సీసాలను పొలాల్లోనూ,రోడ్డుపైనూ పగలగొడుతున్నారు.ఈ రోడ్డు గుండా ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం వందలాది మంది మార్నింగ్ వాకర్స్ (వాకింగ్ పోయే వ్యక్తులు), పుట్లంపల్లి గ్రామ ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు.రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న గాజు పెంకుల వల్ల నడిచే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,పలువురు గాయాలపాలయ్యారు కూడా.ఈ తీవ్రమైన సమస్యపై స్థానిక పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ,వారి నుంచి ఎలాంటి స్పందన లేదని, పెట్రోలింగ్ కూడా నిర్వహించడం లేదని గ్రామస్థులు మరియు మార్నింగ్ వాకర్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులను నష్టపరుస్తున్న దొంగలను, బహిరంగ ప్రదేశాల్లో తాగుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న తాగుబోతులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పుట్లంపల్లి గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని,ఈ మార్గంలో రాత్రి వేళల్లో పోలీస్ గస్తీ (పెట్రోలింగ్) పెంచాలని,శాంతిభద్రతలను కాపాడాలని పుట్లంపల్లి గ్రామ ప్రజలు,రైతులు,మరియు మార్నింగ్ వాకర్స్ సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నారు.