బెజ్జంకి, జూన్ 1 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలోని పిల్లవాగు పైన ఉన్న విద్యుత్ వైర్లపై పిచ్చుకలు గూళ్లు నిర్మించుకోవడం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రకృతిలో భాగమైన పిచ్చుకలు తమ నివాసంగా విద్యుత్ వైర్లను ఎంచుకుని గూళ్లు కట్టుకోవడం అరుదైన దృశ్యంగా మారింది.నేటి ఆధునిక జీవనశైలిలో పిచ్చుకల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో గుగ్గిళ్ల గ్రామంలో ఈ పక్షులు గూళ్లు నిర్మించుకోవడం పర్యావరణ ప్రేమికులను ఆనందపరుస్తోంది.పిల్లవాగు పరిసర ప్రాంతాల్లో ఆహారం, అనుకూల వాతావరణం ఉండటంతో పిచ్చుకలు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నట్లు గ్రామస్థులు భావిస్తున్నారు.విద్యుత్ వైర్లపై వరుసగా కనిపిస్తున్న పిచ్చుకల గూళ్లు గ్రామ ప్రజలను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. ఈ దృశ్యం పర్యావరణ పరిరక్షణతో పాటు పక్షుల సంరక్షణ అవసరాన్ని గుర్తు చేస్తోందని స్థానికులు పేర్కొన్నారు.