ఘట్కేసర్, ఏప్రిల్ 24 (ప్రజావాణి). ఘట్కేసర్ సర్కిల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీమతి వాణి, తహసీల్దార్ శ్రీ చంద్రశేఖర్ పాల్గొని సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు పురోగతి, ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన మరియు ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాల తొలగింపు, డూప్లికేట్ నమోదుల గుర్తింపు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీమతి వాణి మాట్లాడుతూ, ప్రతి బూత్ స్థాయిలో ఖచ్చితమైన మరియు పారదర్శకమైన ఓటరు జాబితా సిద్ధం చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఇంటింటి సర్వేలను కచ్చితంగా నిర్వహించి, అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని బూత్ స్థాయి అధికారులకు సూచించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
ఘట్కేసర్ తహసీల్దార్ శ్రీ చంద్రశేఖర్ మరియు డిప్యూటీ తహసీల్దార్ శ్రీ భాస్కర్ రెడ్డి పనుల పురోగతిని సమీక్షించి, అవసరమైన సూచనలు అందించారు.
సూపర్వైజర్లు తమ పరిధిలోని బూత్ స్థాయి అధికారుల పనిని నిరంతరం పర్యవేక్షిస్తూ, లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీలు శ్రీ వేణు గోపాల్ రెడ్డి, శ్రీ శశి కుమార్, శ్రీ సతీష్, బూత్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
