prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 7:07 am Digital Edition : PRAJA VANI

పసి పిల్లల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు

*పసి పిల్లల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు*

*ఫిట్ నెస్ లేని బస్సులు నకిలీ లైసెన్స్ లతో పసి ప్రాణాలు తీస్తున్న డ్రైవర్లు…*

*స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో యూ కే జీ చిన్నారి సహస్ర దుర్మరణం పాలు..*

*బాధితులకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి ఏఐఎస్ఎఫ్ డిమాండ్…*
షాద్నగర్ ప్రజావాణి జూలై 25
నియోజకవర్గంలోని
చౌదర్‌గూడ మండల కేంద్రంలోని అబ్యాస్ విద్యాపీఠం లో గల ప్రవేట్ పాఠశాల లో చదువుతున్న యూ కే జీ చిన్నారి సహస్ర  నిన్న సాయంత్రం   5 గంటల సమయంలో  స్కూల్ బస్ ప్రమాద  ఘటన లో దుర్మరణం పాలైంది అయితే కాస్లాబాద్ గ్రామానికి చెందిన కృష్ణయ్య -మనీష దంపతుల కుమార్తె,సహస్ర ఈ పసి పాప అబ్యాస్ విద్యాపీఠం లో గల పాఠశాలలో యూకేజీ చదువుతున్న చిన్నారి.. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నిన్న సాయంత్రం  తన ఇంటి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం అత్యంత హృదయ విదారకం చాలా  బాధాకరం. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం మరియు డ్రైవర్ల బాధ్యతారహిత  చర్యల  కారణంగానే పసికందు సహస్ర ప్రాణాలు గాల్లో కలిసిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది….ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పవన్ చవాన్ మరియు రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ మృతిచెందిన చిన్నారి సహస్ర తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఏఐఎస్ఎఫ్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ…పాఠశాల బస్సుల నిర్వహణలో భద్రతా ప్రమాణాలను సరిగా పాటించకుండా విస్మరిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించి చిన్నారి ప్రాణాల బలికి కారణమైన బస్సు డ్రైవర్‌తో పాటు స్కూల్ మేనేజ్‌మెంట్‌పై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు.
నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారిని కోల్పోయి రోడ్డున పడిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని, వారికి తక్షణమే రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు  పునరావృతం కాకుండా విద్యాశాఖ మరియు రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ప్రతి బస్సు వద్ద అటెండర్లు ఉండేలా మరియు పిల్ల  ప్రయాణ సమయాలలో ప్రత్యేక  శ్రద్ధ వహించేలా కఠిన నిబంధనలు అమలు చేయాలని వారు  విద్యార్థి సంఘం నాయకులు ఈసందర్భంగా ఘాటుగా హెచ్చరించారు.