రామగిరి మండలంలో ఘనంగా వన మహోత్సవం.. ఉచితంగా మొక్కల పంపిణీ
గ్రామాన్ని ‘హరితవనం’గా తీర్చిదిద్దడమే లక్ష్యం
పెద్దపల్లి/ (పన్నూర్) జూలై28 ప్రజావాణి :
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉందని, పచ్చదనంతోనే మానవ మనుగడ సాధ్యమని పన్నూర్ గ్రామ సర్పంచ్ చిందం మహేష్ స్పష్టం చేశారు. రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్తులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు.
ప్రతి కుటుంబం ఒక మొక్కను నాటాలి:
ఈ సందర్భంగా సర్పంచ్ చిందం మహేష్ మాట్లాడుతూ.. పన్నూర్ గ్రామాన్ని సుందర హరితవనంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రామపంచాయతీ తరఫున పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గ్రామస్తులంతా వన మహోత్సవంలో చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం బాధ్యతగా కనీసం ఒక మొక్కనైనా నాటి, దానిని సంరక్షించాలని కోరారు. పచ్చదనం పెంపొందిస్తేనే భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కావేటి మల్లేశ్వరి, గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రేమలత, వార్డు సభ్యులు సుధాకర్, వైష్ణవి, స్వప్న, ప్రదీప్, అరుణలతో పాటు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.