prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 12:38 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

పదవ తరగతి ఫలితాల్లో ఎండపల్లి మండలం జోరు

పదవ తరగతి ఫలితాల్లో ఎండపల్లి మండలం జోరు

10/10 సాధించిన పలు పాఠశాలలు

మండల విద్యాధికారి సముద్రాల హరికృష్ణ హర్షం

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఏప్రిల్ 29 (ప్రజావాణి):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన 2025-26 విద్యా సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలం అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. మండల వ్యాప్తంగా విద్యార్థులు సాధించిన ఫలితాలపై మండల విద్యాధికారి (ఎంఈఓ) సముద్రాల హరికృష్ణ హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని వివిధ పాఠశాలల నుండి మొత్తం 220 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 215 మంది (97.7%) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సుమారు 9 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించి మండల స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలోనూ సత్తా చాటారు. మండలంలోని ఎండపల్లి, గోడిసెలపేట, గుల్లకోట, కొత్తపేట, పాతగూడూరు గ్రామాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు, అక్షర ప్రైవేట్ ఉన్నత పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విభాగాల్లో విద్యార్థులు పోటాపోటీగా మార్కులు సాధించారు. పాతగూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన టి సహశ్రిత (తండ్రి తిరుపతి) 558 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. అక్షర ఉన్నత పాఠశాలకు చెందిన ఎం విభశ్రీ (తండ్రి శివ) 566 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. మండల వ్యాప్తంగా ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఎంఈఓ సముద్రాల హరికృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయ బృందాన్ని ఆయన కొనియాడారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదివి, ఉన్నత లక్ష్యాలను చేరుకుని మండల కీర్తిని దశదిశలా చాటాలని ఆయన ఆకాంక్షించారు.