ఘట్కేసర్, ఆగస్టు 2: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నారాపల్లి యూ-టర్న్ సమీపంలోని ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఘట్కేసర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వై. రవీందర్, ఎస్ఐ సోమయ్య తమ సిబ్బందితో కలిసి వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
రోడ్డు కాంట్రాక్టర్ నరేందర్ను తక్షణమే పిలిపించి గుంతలను డాంబర్తో పూడ్చివేయించారు. మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులు సమర్థవంతంగా ట్రాఫిక్ను నియంత్రించి వాహనాల రాకపోకలు సాఫీగా కొనసాగేలా చర్యలు చేపట్టారు.
సమస్యపై వేగంగా స్పందించి రహదారిని వినియోగానికి అనువుగా మార్చిన ఘట్కేసర్ ట్రాఫిక్ పోలీసుల సేవలను వాహనదారులు, స్థానిక ప్రజలు అభినందించారు. ప్రజల భద్రత, సౌకర్యమే తమ ప్రాధాన్యమని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
