ఘట్కేసర్, ఏప్రిల్ 16 (ప్రజావాణి): ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో యమనంపేట్, నారపల్లి ప్రాంతంలో అమరవీరుల స్మారకార్థం చలివేంద్రం ప్రారంభించారు. ఈ చలివేంద్రాన్ని మీసాల రాజేష్ పోచారం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్, అంబేద్కర్ యువజన సంఘం, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీసాల రాజేష్ పోచారం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రయాణికులు, కార్మికులు మరియు సాధారణ ప్రజలు దాహార్తి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి రోజు శుద్ధమైన చల్లని తాగునీటిని అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని, మరింత మంది ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యమనంపేట మరియు నారపల్లి మాజీ కౌన్సిలర్, నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.