సిద్దిపేట జిల్లా,ప్రజావాణి
బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం (నాచారం గుట్ట) ప్రతినిధులు శుక్రవారం నాడు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కలిశారు. గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రతినిధులు కేసీఆర్ ని కలిసి, ఆలయ బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరారు. నాచారం గుట్ట క్షేత్రంలో ఈ నెల 8వ తేదీ నుండి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరుతూ ఆలయ చైర్మన్ రవీందర్, కార్యనిర్వహణాధికారి (ఈఓ) రంగాచారి, అర్చక బృందం కేసీఆర్ కి అధికారికంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు కేసీఆర్ కి స్వామి వారి ప్రసాదాన్ని అందజేసి, వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక ఆశీర్వచనాలు పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులతో పాటు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.