గరిడేపల్లి, ఆగస్టు 6 (ప్రజావాణి): నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవకపోవడంతో సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు బావులు, బోర్లపై ఆధారపడి అక్కడక్కడా మాత్రమే నాట్లు వేస్తున్నారు.
గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు వరద నీరు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో త్వరలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కూడా నీరు చేరి ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సాగర్లో తగినంత నీరు చేరితే ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీటి కొరత తీరడంతో పాటు విస్తృతంగా నాట్లు వేసుకునే అవకాశం ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. వర్షాలు మరింతగా కురిసి సాగర్ ప్రాజెక్టుకు సమృద్ధిగా నీరు చేరాలని రైతులు కోరుతున్నారు.