ఘట్కేసర్, మే 1 (ప్రజావాణి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వినయ్ కృష్ణ రెడ్డి శుక్రవారం ఘట్కేసర్ సర్కిల్ పరిధిలో పలు ప్రాంతాలను అధికారులతో కలిసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీల ప్రజలతో సమావేశమై “ఫ్రైడే డ్రై డే” కార్యక్రమంపై అవగాహన కల్పించారు. గృహాల్లో దోమల లార్వా పెరుగుదలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
జోడిమేట్ల, మిరాలం కుంట ప్రాంతాల్లో నిల్వ నీటిని పరిశీలించిన కమిషనర్, యాంటీ లార్వల్ ఆపరేషన్స్ (ఏ ఎల్ ఓ)ను విస్తృతంగా చేపట్టి దోమల పెరుగుదలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు.
తదుపరి శిల్పా నగర్ పార్క్ను సందర్శించిన ఆయన, స్వయం సహాయక సంఘాలకు తగిన శిక్షణ ఇచ్చి పార్క్ నిర్వహణను మెరుగుపరచాలని సూచించారు. నాగారం డివిజన్లో గుర్రపు డెక్క తొలగింపు పనులను కూడా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి, వివిధ శాఖల అధికారులు, సానిటేషన్ సిబ్బంది, కాలనీల ప్రజలు పాల్గొన్నారు.
