దేవరకద్రలో విలక్షణ తీర్పుకు రంగం సిద్ధం…!
– సర్వేలో సంచలన విషయాలు
– అభ్యర్థులకు అంతు చిక్కని ఓటర్ నాడి
– పలు వార్డులలో అంచనాలు తారుమారయ్యే అవకాశం
ప్రజావాణి దేవరకద్ర : నూతనంగా ఏర్పడిన దేవరకద్ర మున్సిపాలిటీలో తొలిసారి జరగనున్న ఎన్నికలు నాయకులని కలవరపెడుతున్నాయి. ఓటింగ్ కు ఒకే రోజు ఉన్నప్పటికీ ఓటర్ల నాడి అంతుచిక్కక ప్రధాన రాజకీయ పక్షాలు, అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ప్రచారం హోరాహోరీగా సాగింది. ప్రస్తుత పరిస్థితులు మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. గడువు సమీపిస్తుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా జరిగిన రహస్య సర్వేలో అభ్యర్థుల కందని అంతుచిక్కని విషయాలు తెలిశాయి. పలు వార్డులలో రాజకీయ ఉద్దండుల అంచనాలను తారుమారు చేస్తూ విలక్షణ తీర్పుకు దేవరకద్ర ఓటర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
వలస ఓటర్ ఎటువైపు…?
తటస్థ, వలస ఓటర్లకు గాలం వేసేందుకు అన్ని పార్టీల నాయకులు ఎత్తులకు పైఎత్తు వేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు పలు కారణాలు, బతుకుదెరువు కోసం వెళ్లిన కుటుంబాలను కలుస్తూ…ఓటింగ్ రోజు వచ్చేలా ప్రణాళిక చేస్తున్నారు. దేవరకద్ర మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు సుమారు 100 మంది వరకు ఇతర ప్రాంతాలకు ఓటర్లు బతుకు దెరువు కోసం వలస వెళ్లారన్న అంచనా ఉంది. వారు హైదరాబాద్, సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. భవన నిర్మాణ రంగం, బార్. భవన నిర్మాణ రంగం, రోజువారి కూలీ, అవుట్ సోర్సింగ్, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. పలువురు యువతీ యువకులు ఉన్నత విద్య, ఉద్యోగ అవసరాల నిమిత్తం హైద్రాబాద్, సికింద్రాబాద్, ముంబాయి, బెంగుళూరు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఓట్ల సమయంలో స్వంత పట్టణాలకు వస్తారు. వీరిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో వార్డులో 200 పైగా ఉన్న యువత వేసే ఓటే పార్టీలో భవిష్యత్తును నిర్ణయించనున్నాయి . వీరి ఓట్లు కీలకం కావడంతో వారు ఎటువైపు నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది.
సామాజిక వర్గం ఓట్లే లక్ష్యంగా…
ఏ పార్టీకి గెలుపు అంత సులభంగా లేకపోవడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. నివేదికల ఆధారంగా ప్రచారాన్ని మార్చుకుంటున్నారు. ముఖ్యంగా వార్డులలోని సామాజిక ఓట్లను గుంపు గుత్తగా తమ వైపు తిప్పుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ప్రధాన వ్యక్తుల దగ్గరికి వెళ్లి ఆ ఓట్లు తనకే పడాలని కొందరు నాయకులు చేసిన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది 13న తేలనుంది. ముఖ్యంగా సర్వేలో తెలిసిన కొన్ని వివరాల ప్రకారం.. పార్టీలకు కాకుండా నిలబడిన అభ్యర్థులకు పెద్దపీట వేస్తూ ఓటర్లు చెప్పిన వివరాల ప్రకారం, రెండు రోజులలో అనుకున్న తీర్పుకు ఓటరు కట్టుబడి ఉంటే కొత్త మున్సిపాలిటీలో విచిత్ర తీర్పు రానుందని తెలుస్తుంది.