prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 2:07 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాల్సిందే : ప్రజాసంఘాలు, వామపక్ష నేతలు.మే 29 సదస్సును విజయవంతం చేయాలని పిలుపు

వినుకొండ మే19 ప్రజావాణి సిపిఐ కార్యాలయంలో అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు,దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఇందుకు సంబంధించిన 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను పార్లమెంట్‌లో చర్చించి రద్దు చేయాలని ప్రజాసంఘాలు,వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు.“రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం” అనే నినాదంతో ఈనెల 29న నిర్వహించనున్న దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా అంశంపై సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది,సిపిఐ మాజీ జిల్లా నాయకుడు పీజే లూకా మాట్లాడుతూ,రాజ్యాంగబద్ధంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.దళిత క్రైస్తవులు చర్చిలకు వెళితే ఎస్సీ హోదా తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు.2026 మార్చి 24న వెలువడిన సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వక్తలు అభిప్రాయపడ్డారు.ఎస్టీలు,బీసీలు లేదా ఇతర వర్గాలకు చెందిన వారు మతం మారినా కుల హోదా కొనసాగుతుంటే,ఎస్సీలు మాత్రమే క్రైస్తవ మతంలోకి మారితే కుల అర్హత కోల్పోవడం వివక్షతపూరితమని పేర్కొన్నారు.ఇది రాజ్యాంగంలోని సమానత్వ హక్కులను సూచించే ఆర్టికల్ 14 15లకు, మత స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ 25కు వ్యతిరేకమని వారు అన్నారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత సమాజాన్ని లోతుగా అధ్యయనం చేసి,కులవ్యవస్థ సామాజిక వాస్తవికతగా కొనసాగుతోందని వివరించారని గుర్తు చేశారు.కులం జన్మతో వస్తుందని,మతం వ్యక్తిగత ఎంపిక మాత్రమేనని పేర్కొన్నారు.మతం మారితే ఎస్సీలు మాత్రమే తమ కుల హోదా కోల్పోవడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.దళిత క్రైస్తవులు,బలహీన వర్గాలు, చర్చి పాస్టర్లు,ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని మే 29న వినుకొండలో జరగనున్న సదస్సును విజయవంతం చేయాలని నాయకులు కోరారు.ఈ సమావేశంలో సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తోట ఆంజనేయులు,కేఎన్‌పీఎస్ రాష్ట్ర నాయకుడు కే.కృష్ణ, ఫిలిప్పు,ప్రభుదాసు హైడ్రాజు గాంధీ,దేవ,ఎస్కేలు,రవికుమార్,యేసురాజు,ప్రేమయ్య,ప్రసన్నకుమార్,బొంకూరి వెంకటేశ్వర్లు హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు